ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ ఉద్యమ చరిత్రను వివరిస్తూ ” ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ ” చరిత్ర గ్రంధాన్ని మార్చి 10న రెండు తెలుగు రాష్ట్రాలలో 150 ప్రాంతాలలో ఆవిష్కరిస్తున్నట్టు ప్రముఖ చరిత్రకారుడు సయ్యద్ నశీర్ అహమ్మద్ వెల్లడించారు. శుక్రవారం నాడు పిడుగురాళ్ల లోని నాని పారడైస్ లోని తన నివాసంలో ఆయనను కలసిన విలేఖరులతో బహుగ్రంథకర్త నశీర్ మాట్లాదారు. శ్రీమతి సావిత్రి బాయి 127వ వర్ధంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి ఆసక్తి గల పాఠకులకు వదాన్యుల చిరుకానుకగా అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ పుస్తకం మహాత్మ జోతిరావు ఫూలే , శ్రీమతి సావిత్రి బాయి ఫూలే ల తో కలసి 170 సంవత్సర క్రితం ” భేటి పడావ్ ” ఉద్యమానికి నాంది పలికిన ఫాతిమా షేక్ మీద భారతదేశం లో వెలువడిన మొట్టమొదటి గ్రంథమని అయన అన్నారు. మహాత్మ జోతిరావు ఫూలే , శ్రీమతి సావిత్రి బాయి ఫూలే లను ఫూలే తండ్రి గోవిందరావు ఫూలే తన ఇంటి నుంచి వెళ్లగొట్టినప్పుడు ఫూలే దంపతులకు తమ ఇంట ఫాతిమా షేక్, ఆమె అన్న ఉస్మాన్ షేక్ ఆశ్రయం కల్పించారని అయన వివరించారు. ఫాతిమా షేక్ మరాఠి భాష నేర్చుకుని సావిత్రి బాయి తో కలసి ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొంది పూలే ప్రారంభించిన పాఠశాలల్లో ఉపాధ్యాయినిగా, ప్రధానోపాధ్యాయినిగా ఉచిత సేవలు అందించారని ఆయన చెప్పారు. ఆమె ఇల్లు ఇల్లు తిరిగి బాలికలను పాఠశాలకు పంపని తల్లి తండ్రులకు పిలుపునిచ్చారని నశీర్ అహమ్మద్ వెల్లడించారు. అంతటి మహనీయురాలి మీద గ్రందం రాసే అవకాశం లభించినందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఈ గ్రంధం 5000 ప్రతులను ప్రచురించడానికి చేయూత నిచ్చిన వదాన్యులులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పుస్తకాన్ని, గ్రంధాలయాలకు, ఆసక్తి గల పాఠకులకు చేరవేయదానికి సహకరిస్తున్న వివిధ సాహిత్య సంస్థలకు, సేవా సంఘాలకు, సహచర సోదరులకు నశీర్ ధన్యవాదాలు తెలిపారు. ఆసక్తి గల సంస్థలు, వ్యక్తులు ఎవ్వరైనా తమ తమ ప్రాంతాలలో ఈ పుస్తకం ఆవిష్కరణ జరిపి ఆసక్తి గల పాఠకులకు, గ్రంధాలయలకు అందజేయడానికి సిద్ధమైనట్టయితే పుస్తకాలను ఉచితంగా అందివ్వడానికి తాము సిద్ధమని ఆయన చెప్పారు. ఈ విషయమై ఆసక్తి గల వ్యక్తులు + 91 9440241727 కు సంప్రదించాల్సిందిగా సయ్యద్ నశీర్ అహమ్మద్ ఆహ్వానించారు